కోట స్వర్ణసాగరం ఆగస్టు 3
కోట మండలం తిన్నెలపూడి పంచాయతీ పరిధిలోని తల్లిపాలవారిస్థావలలో తల్లిపాల వారోత్సవాలను అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలతో నిర్వహించారు.ఈ సందర్భంగా శిశువులకు తల్లిపాల ప్రాముఖ్యత,తల్లిపాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై తల్లులకు వివరించారు.కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కృష్ణమ్మ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం ఎంతో ముఖ్యమని,శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత కీలకమని తెలిపారు.ముఖ్యంగా పుట్టిన తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని అవగాహన కల్పించారు.తల్లిపాలలో శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయని,శిశువులో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయని అంగన్వాడీ సిబ్బంది వివరించారు.తల్లులు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అలాగే శిశువులకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లీబిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని,తల్లులు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించాలని తెలిపారు. శిశువుల ఆరోగ్య సంరక్షణలో కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లులకు తల్లిపాలపై అవగాహన కల్పించడంతో పాటు,శిశువుల ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం,క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై కూడా అంగన్వాడీ సిబ్బంది వివరించారు.ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ,శిశువుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లి తల్లిపాలను ప్రోత్సహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పి.సుజాత,పి.ముత్యాలమ్మ,ఆర్. మాధవి,వి.శశి తదితరులు పాల్గొన్నారు.