శ్యామసుందరపురంలో ఇంటింటా ప్రభుత్వ సంక్షేమ ప్రచారం
ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన
స్వర్ణసాగరం, కోట:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా కోట మండలం శ్యామసుందరపురంలో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృతంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ జిల్లా మైనారిటీ నాయకుడు జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై కరపత్రాలను పంపిణీ చేస్తూ వివరించారు.ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించారు.అభివృద్ధి–సంక్షేమం అనే ద్వంద్వ లక్ష్యాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామస్తులు సానుకూలంగా స్పందిస్తూ తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీ శంషుద్దీన్, మహిళా పార్లమెంట్ కార్యదర్శి సిద్ధప్పరెడ్డి పోలమ్మ, మైనార్టీ నియోజకవర్గ నాయకుడు నౌషాద్ భాషా, సోషల్ మీడియా అధ్యక్షుడు మేజూరు మధుబాబు, బూత్ కన్వీనర్ నందం మోహన్, మహిళా నాయకురాళ్లు సుహాసిని, శోభన, తల్లం శ్రీనివాసులు, ఉక్కు సాయితేజ, ఉపాధ్యక్షులు నీలేష్, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి గ్రామానికీ అభివృద్ధి అనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే “ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా మరింత సమర్థవంతమైన పాలన అందించాలనే లక్ష్యంతో ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.