వరదయ్య పాలెం స్వర్ణ సాగరం జనవరి 18
వరదయ్యపాళెం మండలంలోని కంచరపాళెం పంచాయతీ పరిధిలోని రెడ్డిగుంట చెరువును రియల్టర్లు అక్రమంగా ఆక్రమించడం దుర్మార్గం. చెన్నమ్కి చెందిన ఓ రియల్టర్ వ్యాపారి ఇందుకు బరితెగించిన తీరు చూస్తే అధికారుల తీరుపై కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. చెరువుతో పాటుగా చెరువులోని మట్టిని సైతం దర్జాగా తమ భూమిలో చదునుకు వేసుకోవడం, చెరువుకు రెండువైపులా ఉన్న కాలువలను సైతం పూడ్చివేయడం జరిగింది. ఇది చాలదన్నట్లుగా చెరువు కట్టకు ఆనుకుని ప్రహరీగోడ నిర్మించడం జరిగింది. ఇందుకోసం చెరువు కట్టను సైతం తెగ్గొట్టడం రియల్టర్ బరితెగింపునకు అద్దంపడుతోంది. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎందుకు గుర్తించలేదు. రైతులకు, ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేలా రియల్టర్లు వ్యవహరిస్తున్నా అధికారులు ఎందుకు స్పందించలేదన్న విషయమై వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. ఇందుకు కారణమైన రియల్టర్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాము.



