శ్రీసిటీ,స్వర్ణ సాగరం ఫిబ్రవరి 25, 2026:
శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాకవర్త్ పరిశ్రమ వితరణతో ఇరుగుళం, మాదనపాళెం, అరవపాలెం జడ్పీ హైస్కూళ్ల పదవ తరగతి విద్యార్థులకు బుధవారం పరీక్షా సామగ్రి పంపిణి చేశారు. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షలు వ్రాయడం కోసం ఒక్కో విద్యార్థికి ఒక రైటింగ్ ప్యాడ్, రెండు పెన్నులు, జామెంట్రీ బాక్స్ చొప్పున మొత్తం 130 మంది విద్యార్థులకు మెటీరియల్ అందచేశారు. ఆయా స్కూళ్ల ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాకవర్త్ ప్లాంట్ హెడ్ శ్రీరామ్, కంపెనీ సిబ్బంది చేతుల మీదుగా వాటిని పంపిణీ చేశారు. రాకవర్త్ చొరవను అభినందించిన శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్సార్) నిరీషా సన్నారెడ్డి, శ్రీసిటీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలలో చదివే ప్రతి విద్యార్థికి అన్ని రకాల విద్యావసతులు అందాలన్న లక్ష్యంతో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సహకారం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం శ్రీసిటీ ఫౌండేషన్ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రశంసిస్తూ, శ్రీసిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.




