కోట స్వర్ణసాగరం జూన్ 3
కోట మండలం కోటలో బుధవారం బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మానవత్వాన్ని చారుకున్నారు.చిట్టమూరు మండలం మన్నెమాల గ్రామానికి చెందిన బత్తల రాజశేఖర్ 2 వ వర్ధంతి సందర్భంగా రాజశేఖర్ తండ్రి హనుమంతయ్య దాతృత్వంతో బహుజన యూత్ ఫోర్స్,మరియు అంబేడ్కర్ యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో బిక్షాటన చేసేవారు, దిక్కులేని వారికి ఆహార ప్యాకెట్లు,వాటర్ బాటిల్ పంపిణీ చేశారు.ఈ క్రమంలో కోట నడిబొడ్డులో మెయిన్ రోడ్డు పక్కన ఓ అభాగ్యుడు దయనీయ స్థితిలో పడి ఉన్నాడు.అయితే కోట,వాకాడు,చిట్టమూరు మండలాలకి ప్రధాన కూడలి అయిన కోటలో నిత్యం ఎంతోమంది ప్రజలు నాయకులు అధికారులు సంచరిస్తూ ఉంటారు.కానీ ఓ ప్రమాదంలో కాలు విరిగి నడవలేని స్థితిలో రోడ్డుపై పాకుతూ చూడటానికి కూడా వికారంగా ఉన్న చెంబేడు వెంకటేష్ దీనస్థితి ఎవరి కంట పడకపోవడం ఆశ్చర్యం.ఆ అభాగ్యుడు వెంకటేష్ కు ఆహార పదార్థాలు అందించే క్రమంలో బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరామ్ శివప్రసాద్ (శంకర్) మరియు నాయకులు అతని పరిస్థితిని చూసి చలించి పోయారు.ఈ నేపథ్యంలో మురికితో నిండిపోయిన అతను బట్టలను తీసేసి, అతనికి తల కటింగ్,షేవింగ్ వారే స్వయంగా చేసి కొత్త బట్టలను వేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేశారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు శ్రీరామ్ శివప్రసాద్,దాసరి అశోక్ కాంబ్లే లు మాట్లాడుతూ ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే ఆ భగవంతుడు స్పందిస్తాడో లేదో తెలియదు కానీ మనిషికి మనిషే తోడుగా ఉండి ఆ వ్యక్తిని లేపుతాడు అనే సిద్ధాంతాన్ని ఎంతో మంది మహనీయులు చరిత్రలో చూపించారని,అయితే ప్రస్తుతం రాను రాను మనుషులలో మానవత్వం తగ్గిపోతుందని, ఇలాంటి దీనస్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఈ అభాగ్యుడి ధీన పరిస్థితి ఎవరి మనస్సులను కదిలించలేకపోవడం బాధాకరమని అన్నారు.ఇప్పటికైనా మానవత్వంతో ప్రభుత్వ అధికారులు కానీ వైద్య అధికారులు కానీ నాయకులు గానీ ఎవరైనా స్పందించి ఈ అభాగ్యుడి వైద్య సేవలకు సహకరించగలరని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ శ్రీరాం శివప్రసాద్,కో కన్వీనర్ కుదురు సూర్య,గౌరవ సలహాదారులు దార్ల ఏడుకొండలు, న్యాయవాది అశోక్ కాంబ్లే,బి.వై.ఎఫ్ నాయకులు భూపతి మోహన సాయి,రంజిత్, ధోనీ,గంగపట్నం వంశీ,అంబేడ్కర్ యూత్ సేవా సమితి అధ్యక్షులు తూపిలి వినోద్ తదితరులు పాల్గొన్నారు.



