📍మనుబోలు, స్వర్ణసాగరం :
క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివరాకేష్ హెచ్చరించారు. ఆయన మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలై ఇబ్బంది పడతారని అలా కాకుండా వాటి జోలికి పోరాదని హెచ్చరించారు. వేసవికాలంలో పిల్లలు ఆటవిడుపు కోసం సముద్రాలు నదులు చెరువుల్లో ఈత కొట్టేందుకు వెళుతుంటారని దీనివల్ల అక్కడ పరిస్థితులు తెలియక ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటారని హెచ్చరించారు. మైనర్స్ కి మోటార్ బైకులు ఇవ్వరాదని, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. ఇటీవల నెల్లూరులో ప్రమాదంలో తల్లిదండ్రులపై కేసు నమోదు పరిచారని ఆయన గుర్తు చేశారు. ఆడపిల్లలు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో గుర్తుతెలియని మగ పిల్లలతో చాట్ చేయడం వారి మాయమాటలకు మోసపోవడం జరుగుతుందని తల్లిదండ్రులు ఆడపిల్లలపై నిఘా వేసి సోషల్ మీడియా ఏమి వాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే తనకు సమాచారం ఇవ్వాలన్నారు.



