శిథిల ఆలయాలను దత్తత తీసుకుని పునరుద్ధరించాలి,
– కలవగుంట భరత్ రెడ్డి,

స్వర్ణ సాగరం— తొట్టంబేడు,
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన శివాలయాల రక్షణ మనందరి బాధ్యత అని ప్రముఖ సంఘ సేవకులు కలవగుంట భరత్ రెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలను శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం దత్తత తీసుకుని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బుధవారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు పగడాల మురళి, కొప్పర్ల నాగరాజు, విజయలక్ష్మిలను వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో కలవగుంట భరత్ రెడ్డికి ఘనంగా సన్మానం నిర్వహించారు.
పర్యవేక్షణ లేక పురాతన ఆలయాలు శిథిలం
ఈ సందర్భంగా కలవగుంట భరత్ రెడ్డి మాట్లాడుతూ…
శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల పరిధిలో అనేక పురాతన
శివాలయాలు సరైన పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తొట్టంబేడు మండలం కాసరం వద్ద ఉన్న శివాలయం పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉందని, అటువంటి ఆలయాలను దేవస్థానం దత్తత తీసుకుని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి
అదేవిధంగా ముక్కంటి ఆలయంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భక్తులకు పారదర్శకమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, స్వామి–అమ్మవార్ల దర్శనంలో సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని బోర్డు సభ్యులను కోరారు.
ధర్మకర్తల మండలి సానుకూల స్పందన
భక్తుల సౌకర్యాలు, పురాతన ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి కలవగుంట భరత్ రెడ్డి చేసిన సూచనలపై ఆలయ ధర్మకర్తల మండలి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.



